Menu

UPSC డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ – 3rd August 2026

India Solar Transition UPSC Mains issues impact and way forward

ప్రశ్న: భారతదేశ సౌర విద్యుత్ రంగం వేగంగా విస్తరించింది. కానీ దాని దీర్ఘకాలిక విజయం భూమి, గ్రిడ్, ఫైనాన్స్, నిల్వ, తయారీ రంగాల్లో ఉన్న వ్యవస్థాగత సవాళ్లను పరిష్కరించడం పైనే ఆధారపడి ఉంది. చర్చించండి. భారతదేశ సౌర ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి తగిన సంస్కరణలను సూచించండి.

Q. India’s solar power sector has expanded rapidly, but its long-term success depends on resolving structural challenges in land, grid, finance, storage and manufacturing. Discuss. Suggest reforms to unlock India’s solar energy potential. (GS Paper III – Renewable Energy / Infrastructure / Climate Change)

(జనరల్ స్టడీస్ పేపర్ III – పునరుత్పాదక ఇంధనం / మౌలిక సదుపాయాలు / వాతావరణ మార్పులు)

పరిచయం

భారతదేశ స్వచ్ఛమైన ఇంధన పరివర్తనలో (Clean energy transition) సౌర విద్యుత్ రంగం ఒక ప్రధాన స్తంభంగా మారింది. 2014లో సుమారు 3 గిగావాట్లు (GW) ఉన్న సౌర విద్యుత్ సామర్థ్యం, జూన్ 2026 నాటికి 162.15 గిగావాట్లకు విస్తరించింది. అయితే, ఇదే వృద్ధిని కొనసాగించాలంటే ప్రాజెక్టుల అమలు, గ్రిడ్ విశ్వసనీయత, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేసే వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ప్రధాన భాగం

భారతదేశ సౌర విద్యుత్ రంగంలోని ప్రధాన సవాళ్లు

1. భూసేకరణ, పర్యావరణ సమస్యలు:

భారీ సౌర విద్యుత్ పార్కులకు (Solar parks) విశాలమైన, నిరంతరాయమైన భూమి అవసరం. వ్యవసాయ లేదా పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో భూమిని సేకరించడం వల్ల జీవనోపాధికి, జీవ వైవిధ్యానికి (Biodiversity) ముప్పు కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (Great Indian Bustard) పక్షి రక్షణకు సంబంధించిన ఆందోళనల వల్ల రాజస్థాన్‌లోని ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరిగింది.

2. ట్రాన్స్‌మిషన్, గ్రిడ్ అనుసంధాన లోపాలు:

విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాల (Transmission infrastructure) కంటే సౌర విద్యుత్ సామర్థ్యం చాలా వేగంగా పెరిగింది. రాజస్థాన్, గుజరాత్ లాంటి అత్యధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో గ్రిడ్ రద్దీ, విద్యుత్ తరలింపులో జాప్యం కారణంగా ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తగ్గిస్తోంది.

3. నిరంతర ఉత్పత్తి లేకపోవడం, నిల్వ పరిమితులు:

సౌర విద్యుత్ అనేది పగటి వెలుతురు, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీలు, పంప్డ్ హైడ్రో (Pumped hydro) లాంటి చౌకైన నిల్వ వ్యవస్థల వినియోగం ఇప్పటికీ పరిమితంగానే ఉంది. తగిన నిల్వ సౌకర్యాలు లేకుండా, సౌరశక్తి 24 గంటల పాటు నమ్మకమైన విద్యుత్‌ను అందించలేకపోతోంది.

4. డిస్కమ్‌ల (DISCOMs) ఆర్థిక ఇబ్బందులు:

విద్యుత్ పంపిణీ సంస్థల (Distribution companies) ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటం వల్ల సౌర విద్యుత్ డెవలపర్‌లకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఇది దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై (Power purchase agreements – PPAs) తీవ్ర ప్రభావం చూపుతోంది.

5. దిగుమతులపై ఆధారపడటం:

సౌర విద్యుత్ మాడ్యూల్స్, సెల్స్, ఇతర మౌలిక భాగాల కోసం భారతదేశం ఇప్పటికీ అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇది ఈ రంగాన్ని సరఫరా గొలుసు (Supply chain) నష్టాలకు గురిచేస్తోంది, అలాగే దేశీయ విలువ జోడింపును (Domestic value addition) బలహీనపరుస్తోంది.

6. విధానపరమైన అనిశ్చితి, ఆర్థిక పరిమితులు:

టారిఫ్‌లు (Tariffs), సుంకాలు (Duties), రాష్ట్రాల విధానాల్లో తరచుగా మార్పులు తీసుకురావడం వల్ల అనిశ్చితి నెలకొంటోంది. అధిక మూలధన వ్యయం (Cost of capital) కారణంగా చిన్న డెవలపర్‌లు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

7. నైపుణ్య లోపం:

రూఫ్‌టాప్ సోలార్ (Rooftop solar) విధానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శిక్షణ పొందిన ఇన్‌స్టాలర్‌లు, సాంకేతిక నిపుణుల అవసరం చాలా ఉంది. నాణ్యత లేని ఇన్‌స్టాలేషన్ల వల్ల సామర్థ్యం తగ్గడమే కాకుండా భద్రతాపరమైన ప్రమాదాలు కూడా తలెత్తుతాయి.

అవసరమైన సంస్కరణలు

  • భూమికి సంబంధించిన వివాదాలను తగ్గించడానికి భారతదేశం ల్యాండ్ పూలింగ్ (Land pooling), లీజింగ్ (Leasing), ఆగ్రివోల్టాయిక్స్ (Agrivoltaics) విధానాలను ప్రోత్సహించాలి.
  • సోలార్ పార్కులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ల (Green Energy Corridors) నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.
  • బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, పంప్డ్ హైడ్రో, సోలార్-విండ్-స్టోరేజ్ హైబ్రిడ్ ప్రాజెక్టుల ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
  • ఆర్డీఎస్ఎస్ (RDSS), స్మార్ట్ మీటరింగ్, సకాలంలో టారిఫ్‌ సవరణల కింద డిస్కమ్ సంస్కరణలు అమలు చేయడం చాలా ముఖ్యం.
  • పీఎల్ఐ (PLI), ఆర్ అండ్ డీ (R&D), సాంకేతిక భాగస్వామ్యాల ద్వారా మాడ్యూళ్ల నుంచి పాలీసిలికాన్, వేఫర్లు, సెల్స్, నిల్వ వ్యవస్థల వరకు దేశీయ తయారీని బలోపేతం చేయాలి.
  • స్థిరమైన విధానాలు, సకాలంలో పీపీఏల కుదుర్చుకోవడం, గ్రీన్ బాండ్లు (Green bonds), బ్లెండెడ్ ఫైనాన్స్, సావరిన్ గ్యారంటీల (Sovereign guarantees) ద్వారా పెట్టుబడి నష్టాలను తగ్గించవచ్చు.
  • చివరగా, స్కిల్ ఇండియా, ఐటీఐలు (ITIs), పరిశ్రమల భాగస్వామ్యాల ద్వారా సోలార్ రంగానికి సర్టిఫికేట్ పొందిన నైపుణ్యం గల సిబ్బందిని (Certified workforce) తయారు చేయాలి.

ముగింపు

భారతదేశ సౌర విద్యుత్ లక్ష్యం కేవలం సామర్థ్యాన్ని పెంచడం మీదే ఆధారపడి లేదు. సౌర విద్యుత్‌ను నమ్మకమైన, సరసమైన, స్వావలంబన (Self-reliant) రంగంగా మార్చాలంటే దానికి భూమి అందుబాటు, గ్రిడ్ సన్నద్ధత, నిల్వ, దేశీయ తయారీ, ఆర్థిక స్థిరత్వం, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో కూడిన పూర్తి పర్యావరణ వ్యవస్థ (Complete ecosystem) అవసరం.

ప్రశ్న: హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం విద్యా హక్కును బలహీనపరుస్తుంది, సామాజిక అసమానతలను పెంచుతుంది. చర్చించండి.

Q. Bottom of FormQ. Government school closures in the name of rationalisation can weaken the Right to Education and deepen social inequality. Discuss.

(జనరల్ స్టడీస్ పేపర్ II – విద్య / సామాజిక న్యాయం)

పరిచయం

పేద, గ్రామీణ, అట్టడుగు వర్గాల (Marginalised) పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన విద్యా మద్దతు వ్యవస్థ. గత పదేళ్లలో దాదాపు 94,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని నీతి ఆయోగ్ (NITI Aayog) తాజా నివేదిక పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు (Enrolment) 2.26 కోట్లకు పడిపోయింది. ఇది విద్యా హక్కు చట్టం (Right to Education – RTE), పరిసరాల్లో పాఠశాలలు (Neighbourhood schools) ఉండాలనే భావన, సామాజిక సమానత్వం పట్ల ఆందోళనలను పెంచుతోంది.

ప్రధాన భాగం

హేతుబద్ధీకరణ, పాఠశాలల మూసివేత (Rationalisation and School Closures)

పాఠశాలల హేతుబద్ధీకరణ అంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేసి, ఆ పిల్లలను సమీపంలోని ఇతర పాఠశాలలకు పంపడం. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) హేతుబద్ధీకరణను సమర్థిస్తున్నప్పటికీ, పరిసరాల్లో పాఠశాలలు ఉండాలనే సూత్రాన్ని (Neighbourhood schools principle) బలహీనపరచకూడదని కూడా హెచ్చరించింది.

విద్యా హక్కుపై ప్రభావం (Impact on Right to Education)

విద్యా హక్కు చట్టం, 2009 (RTE Act) ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి. అయితే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసినప్పుడు, పిల్లలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పిల్లలు రోజూ 4-6 కి.మీ ప్రయాణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇది పరిసరాల్లో పాఠశాలలు ఉండాలనే నిబంధనకు విరుద్ధం.

పెరుగుతున్న సామాజిక అసమానత (Deepening Social Inequality)

ఈ మూసివేతల ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో ఎక్కువగా పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాల వారే ఉంటారు. పాఠశాలలు దూరంగా ఉన్నప్పుడు, భద్రత, రవాణా ఇబ్బందుల వల్ల కుటుంబాలు ముందుగా ఆడపిల్లలనే బడి మాన్పిస్తుంటాయి. వలస కార్మికుల పిల్లలు, నిరాశ్రయులైన పిల్లలు కూడా బడి మానేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పాలనాపరమైన ఆందోళనలు (Governance Concerns)

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పాఠశాలలను మూసివేశారు. మధ్యప్రదేశ్‌లో లక్షలాది మంది పిల్లల స్కూల్ రికార్డులు (School records) లేవని, లేదా వారు బడి మానేసే దశలో ఉన్నారని తేలింది. చట్టాల అమలు సరిగా లేకపోవడం, పాఠశాల నిర్వహణ కమిటీలు (School Management Committees – SMCs) క్రియాశీలకంగా లేకపోవడం, ఉపాధ్యాయ ఖాళీలు, పేద తల్లిదండ్రులకు చట్టపరమైన అవగాహన లేకపోవడం వల్లే విద్యా హక్కు చట్టం లక్ష్యాలను చేరుకోలేకపోతోంది.

ముందున్న మార్గం (Way Forward)

పరిసరాల్లో ఉన్న పాఠశాలలను భారతదేశం కాపాడుకోవాలి. పాఠశాలలను మూసివేసే ముందు వాటి వల్ల కలిగే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలి (Social impact assessment). పిల్లలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలి. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. పాఠశాల నిర్వహణ కమిటీలను (SMCs) పునరుద్ధరించాలి. విద్యా హక్కు చట్టం అమలు తీరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురావాలి.

ముగింపు

పాఠశాలల హేతుబద్ధీకరణ అనేది విద్యా లభ్యతను, నాణ్యతను, సామర్థ్యాన్ని మెరుగుపరిస్తేనే ఆమోదయోగ్యం. పేద, గ్రామీణ, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ, ఆడపిల్లలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తే అది తీవ్ర సమస్యగా మారుతుంది. కేవలం పిల్లల పేర్లు నమోదు చేసినంత మాత్రాన విద్యా హక్కు నెరవేరదు. సమీపంలో, పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో, ఎలాంటి వివక్ష లేకుండా పనిచేసే పాఠశాల అవసరం. కాబట్టి, హేతుబద్ధీకరణ విధానం సామాజిక సమానత్వం, సులభంగా చేరుకోగలిగే దూరం, ఉపాధ్యాయుల లభ్యత, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఆధారంగా జరగాలి. ప్రభుత్వ పాఠశాలలను కేవలం ఆర్థిక భారాన్ని మోసే విభాగాలుగా కాకుండా, సామాజిక న్యాయానికి, రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి సాధనాలుగా బలోపేతం చేయాలి.

Enroll Now for Unlimited UPSC Utsav

Start Date

22/03/2026

Timings

08 AM – 4 PM

    Scroll to Top